న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ చివరికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను గారడీ మాటలుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఊహాజనితంగా వ్యాక్సినేషన్ పై మాట్లాడుతోందని దీదీ వ్యాఖ్యానించారు.
వ్యాక్సినేషన్ పై నిరాధార వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరాల్లోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ ఏడాది చివరికి పౌరులందరికీ వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్రం ఇటీవల పేర్కొంది.