కొండాపూర్, అక్టోబర్ 13: రంగురంగుల బతుకమ్మలకు మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యం బుధవారం బతుకమ్మ పెయింటింగ్స్ పోటీలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చిత్రకారులు ఒకరిని మించి మరొకరు బతుకమ్మ చిత్రాలను వేశారు.
అనంతరం ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి మొదటి విజేత కె.రాజేష్కు రూ.5 వేలు, రెండో స్థానంలో నిలిచిన శ్రీదేవి, రజినిలకు రూ.3ల చొప్పున నగదు అందజేశారు. మరో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కేరాఫ్గా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు.
అనంతరం ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో చిత్రకారులు, యువతులు పాల్గొన్నారు.
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉందని టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఎండీ లక్ష్మీ, డైరెక్టర్ వినీతలు అన్నారు. బుధవారం మెడికల్ కాంప్లెక్స్ ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రారంభించిన వారు మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ‘చిత్తూ చిత్తూల బొమ్మా.. శివుని ముద్దుల గుమ్మా’ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.