భాగ్యనగరం పూలవనమైంది.. ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది.. సద్దుల సంబురం నింగినంటింది.. తొమ్మిదిరోజుల వేడుక కనులపండువగా ముగిసింది..వెళ్లు గౌరమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ మహిళా లోకం వినమ్రంగా వేడుకుంది. రోజుకో రీతిలో సాగిన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో బుధవారం సాయంత్రం ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని చాటాయి.
ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ బతుకమ్మ ఘాట్, కర్బలా మైదానం, అంబేద్కర్నగర్, అంబర్పేట, కూకట్పల్లి గ్రామం లో వేలాది బతుకమ్మలు కొలువుదీరాయి. ఆడబిడ్డల ఆటపాటలతో మహానగర వీధులు మార్మోగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగినులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. సౌభాగ్యాలివ్వమని, మహమ్మారి రాకుండా చూడాలంటూ గౌరీదేవిని వేడుకుంటూ బతుకమ్మలను ఘనంగా సాగనంపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
భాగ్యనగరంలో బుధవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో అలకరించిన బతుకమ్మలతో వీధి వీధిన పూల సింగిడి విరబూసింది. కోలాటాలు, దాండియాలతో ఆడబిడ్డలు ఆడిపాడగా, మహిళల చప్పట్లతో వాడలన్నీ మారుమోగాయి. ప్రభుత్వ కార్యాలయాలల్లో ఉద్యోగినులు, సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.