సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ):నగరంలో వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా పరిధిలో 133బస్తీ దవాఖానలు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబా ద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 220బస్తీ దవాఖానలు స్థానికులకు సేవలు అందిస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా కరోనా సమయంలో సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించి బస్తీ దవాఖానల్లోనే ప్రజలను ఆదుకున్నాయి. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో బస్తీ దవాఖానలకు స్థానిక రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రతిఒక్కరికీ వైద్యసేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మూడేండ్ల క్రితం రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. వీటి ద్వారా రోగాలను ప్రారంభ దశలోనే గుర్తించి కట్టడి చేయగలుగుతున్నారు. వైద్యసేవలను మంరిత విస్తరించి ప్రజలకు చేరువ చేసేక్రమంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో మరో 18బస్తీ దవాఖానలను సిద్ధం చేశారు.
నిర్మాణ పనులతో పాటు సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యా యి. కొత్త దవాఖానలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ జిల్లా బస్తీ దవాఖానల సంఖ్య 151కు చేరనుంది. ప్రస్తుతం ఉన్న133బస్తీ దవాఖానల్లో 54రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.క్యాన్సర్ వంటి దీర్ఘకాలికి జబ్బులను సైతం బస్తీ దవాఖానల్లో గుర్తించి ఎంఎన్జే క్యాన్సర్, నిమ్స్ వంటి ప్రభుత్వ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు పంపిస్తున్నారు.ఇప్పటికే 10దవాఖానల్లో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించారు. త్వరలో ఈ సేవలను అన్ని బస్తీ దవాఖానల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.బస్తీ దవాఖానల వల్ల ముఖ్యంగా సీజనల్ వ్యాధు లు, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక వైద్యసేవలను బస్తీ స్థాయిలోనే అందించడంతో రోగులు పెద్ద దవాఖానల కోసం దూర ప్రాంతాలకు, ప్రైవేటు దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. అంతే కాకుండా ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ దవాఖానలపై ఒత్తిడి తగ్గి సూపర్స్పెషాల్టీ సేవలపై అక్కడి వైద్యులు దృష్టి సారించగలుగుతున్నారు.