కరోనా విశ్వరూపంతో దేశం చిగురుటాకులా వణికిపోతున్నది. ప్రపంచ టీకా ఉత్పత్తి కేంద్రంగా పేరున్న భారత్లో.. టీకా కేంద్రాల ముందు ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. వైరస్ను కట్టడి చేసే మూడు వ్యాక్సిన్లకు అనుమతులొచ్చినప్పటికీ, తగిన సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరతతో వందలాది మంది రోగులు ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నారు. యాంటీ వైరల్ డ్రగ్ ‘రెమ్డెసివిర్’ వంటి ఔషధాలు కూడా దొరక్కపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, రెమ్డెసివిర్ తదితర ఔషధాలను ముందుచూపు లేకుండా విదేశాలకు ఎగుమతి చేయడంవల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొన్నదని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రపంచ దేశాలకు అవసరమయ్యే వ్యాక్సిన్లలో దాదాపు 60 శాతం టీకాలు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఉత్పత్తికి కావలసిన వనరులు, యంత్రాంగం ఇక్కడ ఉన్నాయి. అందుకే కరోనా కట్టడి టీకాలను భారత్ మాత్రమే యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేయగలదని అందరూ విశ్వసించారు. అయితే, ప్రస్తుతం దేశంలోనే వ్యాక్సిన్లకు తీరని కొరత ఏర్పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సౌజన్యంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’, హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’, రష్యాకు చెందిన ‘స్పుత్నిక్-వీ’ టీకాలకు దేశంలో అనుమతులు లభించాయి. అయితే, ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ‘కొవిషీల్డ్’, ‘కొవాగ్జిన్’ టీకాలను ఇస్తున్నారు. దేశీయ అవసరాల కోసం ప్రాథమికంగా 15 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి సంస్థలు పక్కన పెట్టాయి. మరో ఐదు కోట్ల టీకా డోసులను తొలి దఫాలో విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించాయి. పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్లను అందించేందుకు ఉద్దేశించిన ‘కొవాక్స్’ కార్యక్రమం కూడా ఇందులో ఉంది. మార్చి నాటికి 4.5 కోట్ల డోసులను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది. అయితే, దేశంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ వరకు టీకా ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. అయితే అప్పటికే మరికొన్ని టీకాలు ఎగుమతి అయ్యాయి. అలా గురువారం నాటికి 94 దేశాలకు 6.6 కోట్ల డోసుల టీకాలను భారత్ ఎగుమతి చేసింది. పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య ఆసియా తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. అలాగే, ఒకవైపు ఎగుమతులు పెరుగడం, మరోవైపు దేశంలో కేసులు విపరీతంగా పెరుగడంతో వ్యాక్సిన్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం దేశీయ సంస్థలకు అనివార్యమైంది. అయితే, ఇదే సమయంలో టీకా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఉత్పత్తి కుంటుపడింది. ఒక టీకా తయారీకి 9 వేల రకాలైన ముడి పదార్థాలను వినియోగిస్తారు. 30 దేశాలు మాత్రమే ఈ ముడి పదార్థాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఇందులో 55 శాతం ముడి పదార్థాలను అమెరికా మాత్రమే ఎగుమతి చేస్తున్నది. అమెరికా తాజా నిర్ణయంతో దేశీయంగా టీకాల ఉత్పత్తి నెమ్మదించింది. అందుకే టీకాలను ఉత్పత్తి చేయగలిగే భారత్.. ప్రస్తుతం వ్యాక్సిన్ దిగుమతుల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తుంది. కాగా గురువారం నాటికి దేశంలో 13.5 కోట్ల టీకా డోసులను ఇచ్చారు. దేశ జనాభాలో ఇది కేవలం 10 శాతం మాత్రమే.
2019-2020 ఆర్థిక సంవత్సరంలో 4,502 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది. అయితే, దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో.. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల సమయంలో (ఏప్రిల్ 2020-జనవరి 2021).. 9,301 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను (రెట్టింపు కంటే ఎక్కువ) విదేశాలకు ఎగుమతి చేసింది. ఒక్క బంగ్లాదేశ్కే 8,828 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను భారత్ ఎగుమతి చేసింది. శ్రీలంక, భూటాన్ వంటి పొరుగు దేశాలకు కూడా ప్రాణవాయువును సరఫరా చేసింది. కాగా, పరిస్థితులను అంచనా వేయకుండా విదేశాలకు మెడికల్ ఆక్సిజన్ను ఎగుమతి చేయడం వల్లే దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని కొందరు ఆరోపిస్తున్నారు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే ‘రెమ్డెసివిర్’ ఔషధానికి అమెరికాకు చెందిన ఎఫ్డీఏ గత అక్టోబర్లో ఆమోదం తెలుపడంతో దీనికి డిమాండ్ పెరిగింది. ఈ ఔషధాన్ని భారత్కు చెందిన మైలాన్, హెటెరో, డాక్టర్ రెడ్డీస్, జైడస్ కాడిలా వంటి ఏడు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. నెలకు 38.80 లక్షల వయల్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థలకు ఉంది. అయితే, ‘రెమ్డెసివిర్’ కొనుగోలుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ముందుకు రావడంతో గడిచిన నాలుగు నెలల్లో 50 శాతం స్టాక్ను (దాదాపు 80 లక్షల వయల్స్ను) ఎగుమతి చేశారు. దీంతో భారత్లో ‘రెమ్డెసివిర్’ కొరత ఏర్పడింది. కొందరు మెడికల్ మాఫియాగా ఏర్పడి ఈ ఔషధాన్ని ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నారు.