శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11: గచ్చిబౌలి సెంట్రల్ బ్యాం కు దోపిడీ య త్నం కేసును పో లీసులు ఛేదించారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే నేరానికి పాల్పడిన దంపతులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు కంప్యూటర్లు, డీవీఆర్లతో పాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజ్గోపాల్ రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గూడూరు గ్రామానికి చెందిన దైత భాస్కర్(26), భవాని దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కొంతకాలం కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చిన ఈ దంపతులు.. గోపన్పల్లి ఎన్టీఆర్నగర్లోని ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ.. అక్కడే ఉంటున్నారు. భాస్కర్ ట్రాలీ ఆటోను లీజుకు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నాడు. కొంతకాలంగా భాస్కర్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డబ్బులు కట్టకపోవడంతో ట్రాలీ ఆటోను ఫైనాన్స్ వారు తీసుకెళ్లగా, మద్యం తాగి నడిపినందుకు మరో ఆటోను పోలీసులు సీజ్ చేశారు. దీంతో దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వీరిద్దరికి గచ్చిబౌలిలోని సెంట్రల్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. తరుచూ అక్కడికి వెళ్తుంటారు. కిటికీలు సరిగా లేకపోవడం, సులువుగా లోనికి ప్రవేశించవచ్చని భావించిన ఈ దంపతులు.. బ్యాంకులో దోపిడీకి పాల్పడితే ఆర్థిక కష్టాలు తీరిపోతాయని భావించారు. ఈ క్రమంలో 8న రాత్రి 1 గంట సమయంలో కిటికీ అద్దం పగులగొట్టి.. గ్రిల్ తొలగించి.. బ్యాంకులో చొరబడ్డారు. సీసీటీవీ, బ్యాంకు అలారం తీగలను కట్ చేసి విద్యుత్ను ఆపేశారు. స్ట్రా రూం తెరుచుకోకపోవడంతో సామగ్రిని ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం దంపతులిద్దరిని అరెస్టు చేశారు.