మణికొండ/ శంషాబాద్ : ప్రభుత్వ రంగ బ్యాంక్లను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాని వ్యతిరేకిస్తూ ఈనెల 15,16 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యదర్శి చంద్రమోహన్, నియోజకవర్గం కన్వీనర్ రుద్రకుమార్ నేతృత్వంలో బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా నార్సింగిలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన అచ్చేదిన్ నల్లధనాన్ని ఇస్తామన్న ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ మొత్తం కార్పొరేట్ పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పగిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఎంతో మంది చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్రజలకు అనుకూల సదుపాయాలు ఉంటాయన్నారు. అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను మొత్తం నీరుగార్చే విధంగా చేస్తూ చాలామంది ఉద్యోగస్తులను రోడ్డున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రుద్రకుమార్తో పాటు నాయకులు అశోక్, సావిత్రి, దివ్య, అన్నపూర్ణ, కిశోర్కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వరంగ బ్యాంక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సోమ, మంగళ వారాలు రెండు రోజుల పాటు బ్యాంక్లను మూసివేశారు. కాగా సమ్మెలో మొదటి రోజు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు, ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. విత్డ్రా, చెక్కుల క్లియరెన్స్, డిపాజిట్లు వంటి ప్రధాన సేవలు నిలిచిపోయాయన్నారు.