వెంగళరావునగర్, జూలై 12 : బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు, వీఐపీలు రానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. క్యూలైన్ల ఏర్పాటు, భక్తుల వాహనాలు వేర్వేరు చోట్ల పార్కింగ్ చేసే సదుపాయం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 462 మంది పోలీసు బలగాలు, 100 మంది సాయుధ బలగాలు, ఇద్దరు ఏసీపీలు, 26 మంది ఇన్స్పెక్టర్లు, 40 మంది సబ్ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహించానున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పోలీసులకు, ఆలయ కమిటీ సభ్యులకు, దేవస్థాన అధికారులకు సూచనలిస్తూ కల్యా ణం వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నా రు. విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఆలయం కాంతులీనుతుంది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ కల్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. దేవస్థానం పరిసరాల్లో ఇదివరకే 50 వరకు సీసీ కెమెరాలుండగా, ప్రస్తుతం మరో 30 హెచ్డీ కెమెరాలను బిగించామని తెలిపారు. ఇందుకుగాను ఎల్లమ్మ ఆలయం ఎదురుగానే ఓ కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రత్యేక క్యూలైన్లతో అధికారులు అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు, తిరిగి వెళ్లే వారికి, మహిళా భక్తులకు, వీఐపీలకు వేర్వేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి మంత్రులు, ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అమీర్ పేట్ వైపు నుంచి ఫతేనగర్ కు వెళ్లే వాహనాలను బతుకమ్మ చౌరస్తా మీదుగా మళ్లీస్తారు. ఫతేనగర్ నుంచి అమీర్ పేట్ వైపునకు వచ్చే వాహనాలను బీకేగూడ వార్డు ఆఫీసు పక్కన రోడ్డు నుంచి మళ్లించనున్నారు. నేచర్ క్యూర్ దవాఖాన నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ వైపునకు వాహనాలను అనుమతించమని భద్రతా సిబ్బంది తెలిపారు.