అమీర్పేట్, జూలై 12 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం అధికారులతో కలిసి మంత్రి తలసాని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. ఉదయం 11.30గంటలకు ఆలయం ఎదుట నిర్మించిన షెడ్డులో అమ్మవారి కల్యాణం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో పతిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు క్యూ లైన్లలో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.