అమీర్పేట్, జూలై 11 (నమస్తే తెలంగాణ) :తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గణపతి పూజతో మహోత్సవాలు ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించలేదు. ఈ సారి కరోనా అదుపులో ఉండటంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వేడుకల్లో ప్రధాన ఘట్టమైన కల్యా ణ మహోత్సవం 13న మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్నది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టు చీర, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. 14న బుధవారం ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవం దేవాలయం నుంచి ప్రారంభమై తిరిగి ఆలయానికి చేరుకోవడంతో వేడుకలు ముగిస్తాయని ఈవో అన్నపూర్ణ తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్ఎస్ బేకరి వద్ద ఎడమ వైపునకు తీసుకొని, అభిలాష టవర్స్ దగ్గర కుడికి, బీకేగూడ ఎక్స్ రోడ్డు నుంచి భోగా రెసిడెన్సీ, అక్కడి నుంచి హోలీ క్రాస్ మీదుగా ఫతేనగర్కు చేరుకోవాలి.
ఫతేనగర్ నుంచి సత్యం థియేటర్ వైపు వచ్చే వాహనాలను బేగంపేట్ కొత్త బ్రిడ్జి , డీకే రోడ్డు నుంచి బల్కంపేట వెళ్లేవి పద్మశ్రీ అపార్ట్ట్మెంట్ వద్ద మళ్లిస్తారు.
బేగంపేట నుంచి బాలానగర్ వైపు వెళ్లే వారు గ్రీన్ ల్యాండ్స్, లాల్ బంగ్లా సత్యం థియేటర్ మార్గంలో వెళ్లాలి.
ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు లింక్, సర్వీస్ రోడ్లను మూసివేస్తారు.