అమీర్పేట, జూన్ 23 : అమీర్పేట బల్కంపేటలో కొలువుదీరిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని ఈనెల 13న నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా అమ్మవారి కల్యాణోత్సవం భక్తులు లేకుండానే నిరాడంబరంగా నిర్వహించిన నేపథ్యంలో ఈసారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో పోలీస్, జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్అండ్బీ, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, అగ్నిమాపక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కల్యాణం ఏర్పాట్లపై సూచనలు చేశారు. 12వ తేదీ సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్లు, 13న కల్యాణం, 14న రథోత్సవం ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వలంటీర్లకు బార్ కోడింగ్తో కూడిన గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. వేడుకలు జరిగే మూడురోజులపాటు బల్కంపేట నలుదిక్కులా ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలని, ఆలయానికి చేరుకునే మార్గాల్లో అవసరమైన చోట్ల రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని బల్దియా జోనల్ కమిషనర్ ప్రావీణ్యను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలని డీసీపీ శ్రీనివాస్కు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వైద్య సేవలందించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్కు, భక్తులు ఆలయం వద్దకు చేరుకునేలా బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఆర్ఎం యుగంధర్కు చెప్పారు.
వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అధికారులు సమన్వయంతో బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మూడురోజులపాటు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటుండడంతో.. వాహనాలను మళ్లించాలని, ఇందుకోసం సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అవాంతరం రాకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని, మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మీరెడ్డి, కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్గౌడ్, భూపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.