అమీర్పేట్, జూలై 13: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం కన్నుల పండువగా సాగింది. మంగళవారం ఉదయం 11.11 గంటలకు పునర్వసు నక్షత్రయుక్త కన్యాలగ్న సుమూర్తమున అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, తమ కుటుంబం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఇదిలా ఉంటే కల్యాణ మహోత్సవ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరాగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం ఏడు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మా.. నీదే దయ అంటూ వేడుకున్నారు. మొక్కులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కల్యాణానికి ప్రముఖులు తరలివచ్చారు. మంత్రు లు తలసాని శ్రీనివాస్ యాద వ్, ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వా ల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు, బేతి సుభాశ్రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఉప కమిషనర్ రామకృష్ణ, సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ, ఆలయ దాతలు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కూన వెంకటేష్గౌడ్, వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ వైస్ చైర్మన్ పి.వి. రవిశేఖర్రెడ్డి, కార్పొరేటర్లు కేతినేని సరళ, చీర సుచిత్ర శ్రీకాంత్లతో పాటు మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు, అశోక్ యాదవ్, బీఆర్ నారాయణరాజు, కొలను బాల్రెడ్డి తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలకు రావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవారం కలిశారు. ఆహ్వాన పత్రిక అందజేశారు.
అమ్మవారి కల్యాణానికి విచ్చేసిన సాధారణ భక్తులు మొ దలు వీఐపీల వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకే ఆలయానికి చేరుకున్న మంత్రి తలసాని ఆలయ ఈవో ఎస్.అన్నపూర్ణ, చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. అందరి సహకారంతో అమ్మవారి కల్యాణ వేడుకను విజయవంతంగా నిర్వహించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. వర్షం వచ్చినా భక్తులు ఓపికతో వ్యవహరించారని అన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేస్తున్న వారిని మంత్రి తలసాని అభినందించారు.