అనాథలైన చిన్నారులకు అభయం ఈ చిన్నారుల పేర్లు జయశ్రీ, ఏసేంద్ర.. ఊరు బాలాపూర్. కరోనా కాటుకు కుటుంబం బలికావడంతో అనాథలయ్యారు. వీరి దీనగాధపై నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనానికి మానవతావాదులు స్పందించారు. ఆదివారం ఊరి పెద్దమనుషులు ప్రత్యేకంగా సమావేశమై.. పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. వీరంతా కలిసి 8 లక్షల రూపాయలు సమకూర్చగా.. మేయర్ పారిజాత లక్ష రూపాయల విరాళం, 60 గజాల స్థలం అందజేసేందుకు ముందుకొచ్చారు.
బడంగ్పేట, మే 30 : కొవిడ్ – 19 ఒకే ఇంటిపై పిడుగు పడ్డట్టుగా పడి కుటుంబ పెద్దలను బలి తీసుకుంది. ఇటీవల బాలాపూర్లో కరోనా మహమ్మారి సోకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో ఊరి పెద్ద మనుషులు వారికి చేతనైనంత సాయం అందించి మానవత్వాన్ని చాటేందుకు ముందుకొచ్చారు. పిల్లలను ఆదుకోవాలనే సహృదయంతో ఎంతో మంది కంకణం కట్టుకున్నారు. రెడ్డి సామాజిక సంఘం పిలుపు మేరకు ఇందుకు సంబంధించి బాలాపూర్లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి, అనాథలైన పిల్లలను ఆదుకోవాలని తీర్మాణించారు. శ్రీనివాస్రెడ్డి ఇద్దరు పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ఆర్థికంగా వారిని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. అనాథలైన పిల్లలను ఆదుకోవాలని పిలుపును ఇవ్వడంతో “బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి లక్ష రూపాయలు, 60 గజాల ఇంటి స్థలం, బాలాపూర్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ రూ.50 వేలు, పీపీ రెడ్డి ట్రస్టు చైర్మన్ పన్నాల పర్వతాలు రెడ్డి రూ.లక్ష, పన్నాల శ్రీకాంత్ రెడ్డి – రూ.లక్ష, పన్నాల గోపాల్ రెడ్డి రూ.50 వేలు, కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి రూ.30 వేలు, బండ్లగూడ ఖల్సా కో ఆపరేటివ్ చైర్మన్ కొలను తిరుపతి రెడ్డి రూ.25 వేలు, కార్పొరేటర్ బండారి మనోహర్ రూ.25 వేలు, కౌన్సిలర్ అమృత 25 వేలు, మల్లారెడ్డి రూ.25 వేలు, కార్పొరేటర్ బాలు రూ.10 వేలు” అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారు.
గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సమష్టిగా ఎదుర్కోవాలని వారు నిర్ణయించారు. అనాథలకు అండగా ఉండాలని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు పిల్లలు ‘ఏసేందర్, జయశ్రీ’ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. కొలన్ శంకర్ రెడ్డి పిల్లల చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ‘కరోనాతో ముగ్గురు బలి’ అనే కథనం ఈ నెల 28న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైంది. దీంతో చాలా మంది అనాథ పిల్లలను ఆదుకోవడానికి ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు.