బాలానగర్, ఏప్రిల్ 13 : టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బాలానగర్లో ట్రాఫిక్ ఇబ్బందులపై దృష్టి సారించింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక చొరవ చూపించి ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి కానీ.. ఏ ప్రభుత్వం కూడా బాలానగర్లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బాలానగర్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ. 387కోట్ల నిధులతో ఫతేనగర్, బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ చేపట్టిన ఫ్లైఓవర్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. పఠాన్చెరువు టు సికింద్రాబాద్ ప్రధాన రహదారికి ఓ వైపు ఫతేనగర్ డివిజన్ ఉండగా మరో వైపు బాలానగర్ డివిజన్ ఉన్నది. ఈ రెండు డివిజన్ల కలయికతో బాలానగర్ పారిశ్రామికవాడగా పిలుస్తుంటారు. బాలానగర్లో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తి అయితే పారిశ్రామికవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ఫ్లైఓవర్ పనుల పుణ్యమా అని ఇప్పటికే బాలానగర్లో రహదారుల విస్తరణ చేపట్టడంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పవచ్చు. ఫ్లైఓవర్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే బాలానగర్లో ప్రయాణం సునాయాసం కానుంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో బాలానగర్ పారిశ్రామికవాడను ఇట్టే దాటేయొచ్చు.
1.13కి.మీ దూరంతో చేపట్టిన ఫ్లైఓవర్కు మొత్తం 26 పిల్లర్లు ఏర్పాటు చేశారు. 26పిల్లర్లకు గాను 25 స్పాన్లు, పిల్లర్లలో గడ్డర్ల ఏర్పాటు పూర్తి అయింది. అదే విధంగా 22స్పాన్లలో (ఆర్సీసీ గడ్డర్లలో) స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని రెండు స్పాన్లలో స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. కాగా ఫతేనగర్ టీ జంక్షన్లోని మరో స్పాన్లో స్టీల్ గడ్డర్ల ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. ఓవైపు మూ డు స్పాన్లలో స్లాబ్ పనులు చేయడంలో నిమగ్నం కాగా మరో వైపు ఇరువైపుల ర్యాంపు పనులను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటిలో ఒక ర్యాంప్ పిల్లర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేయగా మరో ర్యాంప్ పిల్లర్ ఎన్ఈర్ఎస్సీ వద్ద ఏర్పాటు చేశా రు. రిలయన్స్ బంక్ నుంచి ఆంధ్రాబ్యాంక్ వరకు ఒక ర్యాంపు పనులు, ఎన్ఆర్ఎస్సీ నుంచి ఎస్ఎమ్మార్ వినయ్ క్యాపిటల్ బిల్డింగ్ వరకు రెండో ర్యాంప్ పను లు త్వరలో పూర్తి కానున్నాయి.
ఫ్లైఓవర్ పనులను చకాచ కా పూర్తి చేసి జూన్ 15 వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. 90శాతం వరకు ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరు వరకు స్లాబ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన 3స్పాన్లలో స్టీల్ గడ్డర్ల ఏర్పాటు పనులు పూర్తి కావస్తున్నాయి. జూన్ 15నాటికి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – యూసుఫ్ హుస్సేన్, హెచ్ఎండీఏ ఎస్ఈ
బాలానగర్లో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తి అయితే ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. ఫ్లైఓవర్ పనుల పుణ్య మా అని బాలానగర్లో రహదారుల విస్తరణ చేపట్టడం వలన దాదాపుగా ట్రాఫిక్ రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. ఫ్లైఓవర్ పనులు పూర్తి అయితే బాలానగర్లో అసలు ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. వాహనాలు సాఫీగా వెలుతుంటాయి. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మొదట ప్రజలే సంతోషపడుతారు. తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా మెరుగుపడనుంది. – వెంకటయ్య, బాలానగర్ ట్రాఫిక్ సీఐ