బాలానగర్, మే 9 : స్టాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) లోభాగంగా రూ. 387 కోట్ల నిధులతో ఫతేనగర్, బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ చేపట్టిన ఫ్లైఓవర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాలానగర్ ఫ్లైఓవర్ పనులలో భాగంగా ఇరువైపుల ర్యాంపు పనులు పూర్తి కావచ్చాయి. బీటీ వేయడమే తరవాయి అనే స్థాయిలో పనులు పూర్తయ్యాయి. పఠాన్చెరువు టు సికింద్రాబాద్, జీడిమెట్ల టు సికింద్రాబాద్, చార్మినార్ టు జీడిమెట్ల ప్రాంతాలకు వెళ్లడానికి బాలానగర్ కేంద్ర బింధువు కావడంతో గతంలో బాలానగర్లో ట్రాఫిక్ ఇక్కట్లకు నిలయంగా ఉండేది. ఇక్కడ చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయితే పారిశ్రామికవాడలో ట్రాఫిక్ సమస్యలకు ఇకపై చెక్ పడనుంది. ఫ్లైఓవర్ పనుల పుణ్య మా అని ఇప్పటికే బాలానగర్లో రహదారుల విస్తరణ చేపట్టడంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తప్పినట్లు అయింది. ఫ్లైఓవర్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే బాలానగర్లో ప్రయాణం మరింత సులువుకానున్నది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో బాలానగర్ పారిశ్రామికవాడను ఇట్టే దాటేయవచ్చు. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవాడ ప్రజలు ఫ్లైఓవర్ పనులు ఎప్పుడెప్పుడు పూర్తి అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.
ఫ్లైఓవర్ పనులను జూన్ నెలలో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. 90శాతానికి పైగా ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. 24 స్పాన్లలో స్లాబ్ పను లు పూర్తి అయ్యాయి. ర్యాంపు పనులు కూడా పూర్తి అయ్యాయి. బీటీ వేయా ల్సి ఉంది. ఈ నెలా మొదటి వారంలో స్లాబ్ పనులు పూర్తి చేసి డివైడర్ పనులు చేపడుతాం. మిగిలిన 1 స్పాన్లో స్టీల్ గడ్డర్ల ఏర్పాటు పనులు పూర్తి కావస్తున్నాయి. 24 స్పాన్లలో స్లాబ్ పనులు పూర్తి చేశాం. జూన్ నెలలో అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. యూసుఫ్ హుస్సేన్, ఎస్ఈ, హెచ్ఎండీఏ
బాలానగర్లో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తి అయితే ట్రాపిక్ ఇబ్బందులుండవు. ఫ్లైఓవర్ పనుల పుణ్య మా అని బాలానగర్లో రహదారుల విస్తరణ చేపట్టడం వలన దాదాపుగా ట్రాఫిక్ రద్ధీ చాలా వరకు తగ్గింది. ఫ్లైఓవర్ పనులు పూర్తైతే బాలానగర్లో అసలు ట్రాఫిక్ ససమస్యలు తలెత్తవు. వాహనాల రాకపోకలు సాఫీగా జరుగుతుంటాయి. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. వెంకటయ్య, బాలానగర్ ట్రాఫిక్ సీఐ