నగరానికి చెందిన ఓ యువకుడికి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం వచ్చింది.. అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది.. దానికి కట్టింది జస్ట్ రూ.10లక్షలు… ఆ లెటర్ తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు.. అధికారులకు దాన్ని చూపెట్టగా అది ఫేక్దని చెప్పారు.. ఒక్కసారిగా షాక్నకు గురైన ఆ యువకుడు ఉద్యోగం ఇప్పించిన కన్సల్టెన్సీని సంప్రదించగా ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయి.. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఇలా ఆ ఒక్కడు కాదు.. దాదాపు 90 మంది బాధితులు మోసపోయి 2020లో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.. ఈ 90 మంది బ్యాక్ డోర్లో ఉద్యోగాలనగానే రూ. 2.08 కోట్లను సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోయారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా, బ్యాక్డోర్ ఉద్యోగం ఖాయమన్నా అసలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. యువత.. టాలెంట్ను నమ్ముకోవాలే తప్పా.. బ్యాక్డోర్ లేదా మోసపూరిత కన్సల్టెన్సీ మాయలో పడొద్దన్నారు. వాట్సాప్, ఈమెయిల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ద్వారా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నా, మీకు ఉద్యోగం వచ్చిందని మాయ చేయాలని చూసినా అది సైబర్ మోసమని గు ర్తించారు. ఉద్యోగం ఇచ్చేవారు డబ్బులు ఇస్తారు తప్పా.. డబ్బులు అడగరని గుర్తించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.