మన్సూరాబాద్, సెప్టెంబర్ 12 : ఇండ్లలోని సెఫ్టిక్ ట్యాంకు, సివరేజ్ను తొలగించే విషయంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై శ్రద్ధ చూపాలని ఇంజినీర్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నరేష్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి షిర్టీ సాయినగర్ కాలనీలో ఆదివారం సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సఫాయి సురక్ష ఛాలెంజ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలమండలి ఆధ్వర్యంలో తక్కువ ధరలో సెఫ్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. జలమండలి టోల్ఫ్రీ నెం. 155313లో నమోదు చేసుకున్నట్లయితే సురక్షితంగా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా సెఫ్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తారని తెలిపారు.
పర్యావరణానికి ఎలాంటి నష్టం కలుగని రీతిలో, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సివరేజ్ను వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడ్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ ఎస్. నాగబ్రహ్మ చారి, కార్యదర్శి దేవా, కాలనీ అధ్యక్షుడు కేకేఎల్ గౌడ్, ప్రతినిధులు ఎల్. క్రిష్ణ, కళావతి, రవి తదితరులు పాల్గొన్నారు.