సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): రెండు దశల్లో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేశామని, మూడో దఫా లాక్డౌన్కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దంటూ పోలీసులు బుధవారం అసెంబ్లీ ఎదుట కరోనా రూపంలో హెల్మెట్లు ధరించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్డౌన్ ఆంక్షల సడలింపు సమయం పెరుగుతుందన్నారు.
శుక్రవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపు ఉంటుందని సీపీ సూచించారు. నగరంలో 14 వేల మంది పోలీస్ సిబ్బంది మూడు షిఫ్ట్ల్లో పనిచేస్తున్నారని, వారిలో 2 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అందులో 17 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ప్రతి రోజు ఉల్లంఘనలకు పాల్పడిన వారికి సంబంధించిన ఆరు వేల వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు శిఖా గోయెల్, చౌహాన్, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ ఉన్నారు.