మిడ్జిల్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో బీజేవైఎం మాజీ అధ్యక్షుడు రమేశ్, దళితమోర్చా మండల అధ్యక్షుడు రాములు, కాంగ్రెస్ నాయకులు లింగం, రవి, రాఘవేందర్, పోశలతోపాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.