చార్మినార్, జూన్ 13 :తనతోపాటు పనిచేస్తున్న ఓ యువకుడి వేధింపులు భరించలేక ఓ యూట్యూబ్ చానల్ ఎడిటర్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన డబీర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే సయ్యదా నహేబా (37) డబీర్పుర ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్ఆర్క్యూ 24 యూ ట్యూబ్ చానల్లో ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నది. అందులోనే విధులు నిర్వహించే సయ్యద్ సలీమ్.. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై గత 20 రోజులుగా సయ్యదా నహేబా ఆందోళన చెందుతుంది. దీనిపై ఆమె గత నెల 25న నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సయ్యద్ సలీం మరింతగా రెచ్చిపోయి.. వేధింపులను రెట్టింపు చేశాడు. శనివారం సాయంత్రం సయ్యద్ సలీమ్.. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూ.. నీవు ఎక్కడ ఫిర్యాదు చేసినా.. నన్ను ఎవరు ఏం చేయలేరంటూ భయపెట్టాడు.. దీంతో మరింత మానసిక వేదనకు గురైన సయ్యదా నహేబా ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన సయ్యదా నహేబాను చికిత్స నిమిత్తం సంతోష్నగర్లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుతురు నబిహ ఖాద్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.