చెత్తను కాల్చవద్దని, మాకు చెబితే మేం తీసుకెళ్తామని చెప్పిన పారిశుధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ, వసంతనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగానికి చెందిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ(ఎస్ఎఫ్ఏ), పారిశుధ్య మహిళా కార్మికులతో కలిసి రోడ్డు పక్కన చెత్తాచెదారాన్ని తొలిగించే పనులు చేస్తున్నారు. రోడ్డు నం.18లోని ఖాళీ స్థలంలో ఉన్న చెత్త, వ్యర్థాలను ఓ ఇంటికి సంబంధించిన వ్యక్తి నిప్పుపెట్టి కాలుస్తున్నా డు. గమనించిన పారిశుధ్య సిబ్బంది.. చెత్త ఉంటే మాకు చెప్పాలని, కాల్చవద్దని అతడిని కోరారు. దీంతో అతడు వారిని దూషిస్తూ వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఎఫ్ఏ కృష్ణ, పారిశుధ్య కార్మికులు వి.కవ్వమ్మ, జయమ్మ, సావిత్రి, కుమారస్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తి అక్రమంగా పండ్ల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడని దాని కి సంబంధించిన వ్యర్థాలను ఖాళీ స్థలంలో వేస్తూ ప్రతిరోజూ కాల్చుతున్నట్లు సమాచారం. బాధిత కార్మికులు మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్కు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.