సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక సమస్య సృష్టించి.. మోసంతో నగదు తస్కరిస్తున్న హర్యానాకు చెందిన మెవత్ ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీకి చెందిన మహ్మద్ ఇక్బాల్కు టెక్నాలజీపై కొంత పట్టుంది. మెవత్ ప్రాంతానికి చెందిన ట్రక్ డ్రైవర్ అన్సా, కంప్యూటర్ డిప్లమా చేసిన మహ్మద్ సలాయిమ్తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.
ఆ ప్రాంతంలో ఉన్న వారి వద్ద నుంచి డెబిట్ కార్డులను కొన్నిరోజులు ఉపయోగించుకునేందుకు తీసుకుంటారు. సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి… వాటి ద్వారా డబ్బులు డ్రా చేస్తారు..యంత్రం నుంచి నగదు వచ్చే సమయానికి సాంకేతిక సమస్య సృష్టిస్తారు. దీంతో డబ్బు బయటకు వచ్చినా.. లెక్కలో మాత్రం టెక్నికల్ సమస్య వల్ల డబ్బులు ఇవ్వలేకపోయామని రికార్డు అవుతుంది. ఇలా ఈ ముఠా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల్లో నగదును మోసంతో తస్కరించింది.
తొలుత ఇద్దరు వ్యక్తులు ఏటీఎం కేంద్రంలోకి వెళ్తారు. డబ్బు డ్రా చేసే సమయానికి సాంకేతిక సమస్య సృష్టించి నగదు తీసుకుంటారు. దీంతో పాటు ఇతరుల కార్డుల పిన్ నంబర్ను దొంగిలించేందుకు ఏటీఎం కేంద్రంలో కెమెరా ఫోన్నూ అమరుస్తారు. ఆ సమయంలో బయట ఉన్న వ్యక్తి పరిస్థితులను గమనిస్తుంటాడు. ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత సంబంధిత బ్యాంకు కాల్ సెంటర్కు ఫోన్ చేసి, మేం ఫలాన ఏటీఎం కేంద్రంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్తే..అక్కడ సాంకేతిక సమస్య ఏర్పడిందని, మా సెల్ఫోన్కు మాత్రం ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు సందేశం వచ్చిందంటూ.. ఫిర్యాదు చేస్తారు.
అంబుడ్స్మెన్ నిబంధనల ప్రకారం సాంకేతిక సమస్యతో పొరపాట్లు జరిగినప్పుడు ఖాతాదారుడికి బ్యాంకులు ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని బ్యాంకులు, ఆయా ఖాతాదారుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుంటాయి. ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన సొమ్మును జేబులో వేసుకొని, ఖాతాలో డిపాజిట్ అయ్యే సొమ్మును అసలైన ఖాతాదారుడికి అందిస్తారు. సదరు ఖాతాదారుడి కార్డును వాడుకున్నందుకు అతడికి ఈ ముఠా కొంత కమీషన్ ఇస్తుంది.
ఇలా దేశ వ్యాప్తంగా ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతున్నది. ఈ ముఠాపై నల్లకుంటలో 2019లో ఒక కేసు నమోదు కాగా 2021లో నల్లకుంట, సైదాబాద్, వనస్థలిపురం పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు కేసుల్లో రూ. 6 లక్షలు మెవత్ గ్యాంగ్ ఇలానే ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నది. టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి నేతృత్వంలో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం నల్లకుంట అదనపు ఇన్స్పెక్టర్ కిషన్ బృందంతో కలిసి నిందితులను పట్టుకున్నారు. రూ. 2.11 లక్షల నగదు, 23 డెబిట్ కార్డులు, పెన్ కెమెరా, ఏటీఎం యంత్రంలో సాంకేతిక సమస్య సృష్టించే రెండు పరికరాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.