బంజారాహిల్స్, జూలై 25: కన్నకూతురు, కుమారుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్ఆర్ఐతో పాటు అతడి స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొడుకు (45) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లో నివాసముంటాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో 2003లో అతడికి వెంకటగిరికి చెందిన మహిళ(40)తో వివాహమైంది. వీరికి కుమార్తె(14), కుమారుడు(11) ఉన్నారు. 2010లో ఇండియాకు తిరిగి వచ్చిన దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో మూడేండ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. తల్లితో పాటు ఉంటున్న కుమార్తె, కుమారుడు కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతుండటంతో అనుమానం వచ్చిన తల్లి వారిని సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. వారికి కౌన్సెలింగ్ చేసిన సమయంలో నాలుగైదేండ్ల క్రితం తండ్రి, అతడి స్నేహితుడు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడేవారంటూ కూతురు, కుమారుడు చెప్పారు. తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తండ్రితో పాటు అతడి స్నేహితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.