సైదాబాద్, జూలై 25 : ఓ యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్ కథనం ప్రకారం.. సైదాబాద్ సాయినగర్ కాలనీలో నివసించే దంపతులకు 16, 14 ఏండ్ల కూతుళ్లు ఉన్నారు. ఈనెల 3న కూతుళ్లను ఇంటి దగ్గర ఉంచి దంపతులిద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఈనెల 6న తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు కూతుళ్లు ఆందోళన, భయంతో కనిపించారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదు.
కాగా, ఈనెల 12న పెద్ద కూతురు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన బాలికను ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గత ఆర్నెళ్లుగా ఉప్పల్కు చెందిన పవన్ కళ్యాణ్ అనే యువకుడు ఫోన్లో చాటింగ్ చేస్తూ వేధిస్తున్నాడని బాలిక తెలిపింది. ఈనెల 5న ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్.. చంపేస్తానంటూ బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడి, పారిపోయాడని చెప్పింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.