శ్రీరామబంటు.. కపిశ్రేష్ఠుడు.. పంచభూతాలను వశం చేసుకున్న పరమాత్ముడు.. జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి.. వీరాంజనేయుడు పుట్టింది మరెక్కడో కాదు మన తిరుమల గిరుల్లోనే. ఏడు కొండల్లోని అంజనాద్రే హనుమంతుడు జన్మించిన స్థలం అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారికంగా ప్రకటించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తియ్యని వార్తను భక్తులకు చేరవేసింది.
తిరుమల, హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన సప్తగిరుల్లోని అంజనాద్రి కొండపైనున్న జపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. ఇక్కడే హనుమంతుడు జన్మించాడని వెల్లడించింది. బుధవారం తిరుమలలో జరిగిన కార్యక్రమంలో కేంద్రీయ సంస్కృత వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య మురళీధర్శర్మ మాట్లాడుతూ.. హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలను సేకరించామన్నారు. ‘హనుమంతుడి జన్మస్థానంపై శాసన, భౌగోళిక, పౌరాణిక, వాఙ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వాటిని బట్టి హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రిగా ప్రకటిస్తున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాద్రిలో హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే ఎగిరాడు. 12 పురాణాల్లో హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని చెప్తున్నాయి’ అని ఆయన తెలిపారు.
పురాణాలూ చెప్తున్నాయ్..
12, 13వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని, వాల్మీకి రామాయణం, తర్జుమా కంబరామాయణంలోనూ దీని గురించి ఉందని మురళీధర్శర్మ వెల్లడించారు. అన్నమయ్య తన కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని, వేంకటాచల మహాత్మ్యం తిరుమల ప్రామాణికమని 2 శాసనాల్లో ఉన్నట్టు వివరించారు. కర్ణాటకలోని హంపిలో ఉన్నది కేవలం కిష్కింధ క్షేత్రం మాత్రమేనని అక్కడ ఆంజనేయుడు జన్మించలేదని మురళీధర్శర్మ తెలిపారు.
టీటీడీ ప్రత్యేక చొరవ
హనుమంతుడు పుట్టిన ప్రాంతాన్ని కనుగొనేందుకు టీటీడీ ప్రత్యేక చొరవ తీసుకున్నది. ఆంజనేయుని జన్మస్థలం వాస్తవాలు తేల్చాలని ఎస్వీ వేదిక్ వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, కేంద్రీయ సంస్కృత వర్సిటీ వైస్ చాన్సలర్ మురళీధర్శర్మ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీలో వీరితో పాటు రాణిసదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్లమూర్తి, ఏపీ పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్కుమర్ సభ్యులుగా ఉన్నారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయనసంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్గా వ్యవహరించారు.