కొండాపూర్, ఆగస్టు 1: సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పాతతరం కళాకారులు వాడిన వస్తువులను నేటి తరానికి తెలియజేసేలా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆద్య కళ’ పేరిట ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలోని వస్తువులను తిలకించారు. కళా ఉత్పత్తులు, వాయిద్యాలు, పెయింటింగ్స్, ఇతర కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. నాటి జ్ఞాపకాలను భద్రపరిచి నేటి తరానికి తెలియజేసేలా ప్రదర్శనను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావును అభినందించారు. 40 సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాలు తిరిగి లోహ శిల్పాలు, చెక్క వాయిద్య పరికరాలు, పెయింటింగ్స్, మ్యాన్ స్క్రిప్ట్, ఎముకలు మొదలుకొని రాళ్లు, తాళపత్ర గ్రంథాలు, పూర్వ మానవులు వినియోగించిన పలు రకాల వస్తువులు, శాసనాలు, రచనలు, వైద్య గ్రంథాలు, అరుదైన లిపిలను సేకరించినట్లు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ టి.కిషన్ రావు, గుజరాతి లలిత కళా అకాడమీ పూర్వ చైర్ పర్సన్ ఇస్తర్ డేవిడ్ పాల్గొన్నారు.