సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): స్నాప్చాట్లో పరిచయం అయిన ఓ యువకుడు…యువతితో వాట్సాప్లో చాటింగ్ చేసి, చివరకు ఆమెకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపించి.. పెండ్లిని చెడగొట్టే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఆ బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేశ్భగవత్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ హెచ్బీ కాలనీలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న వంగ శివకుమార్ అలియాస్ నానికి నగరానికి చెందిన యువతి స్నాప్చాట్లో పరిచయమైంది. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్కు వచ్చిన శివకుమార్, ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. తనకు పెండ్లి కుదిరిందని కాబోయే భర్త నంబర్ కూడా ఇచ్చింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శివకుమార్ ఆ యువతితో తనకు శారీరక సంబంధం ఉందంటూ, వ్యక్తిత్వం మంచిది కాదంటూ ఆమె కాబోయే భర్తకు మెసేజ్లు పెట్టాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న ఫొటోలను కూడా పంపించి పెండ్లి రద్దు చేసుకోవాలంటూ.. బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు శివకుమార్ను అరెస్ట్ చేశారు.