బంజారాహిల్స్, మే 19 : ప్రేమ పేరుతో బాలికను నమ్మించి పార్కులోకి తీసుకువెళ్లి తాళికట్టిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడలో నివాసముంటున్న బాలిక(16) ఇంటర్మీడియట్ చదువుతున్నది. అదే ప్రాంతంలో నివాసముంటున్న రమేశ్ అనే యువకుడు గత ఏడాదికాలంగా అమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఈ నెల 5న బాలికను కృష్ణకాంత్పార్కుకు తీసుకువెళ్లి బలవంతంగా తాళికట్టాడు. అదేరోజు ఆమెను ఇంటికి తీసుకువెళ్లగా రమేశ్ తల్లితో పాటు మేనత్త, ఇతర కుటుంబ సభ్యులు కొట్టి బయటకు తరిమేశారు.
ఇదిలా ఉండగా ఈ నెల 17న ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న బాలికను గమనించిన తల్లి ఏం జరిగిందని ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. తమ కూతురును పెండ్లిపేరుతో వంచించాడంటూ అదేరోజు రమేశ్ కుటుంబసభ్యులకు చెప్పేందుకు వెళ్లిన బాలికతల్లిపై రమేశ్ తల్లి ఏసమ్మ, మేనత్త ఫాతిమా, మేనమామ షేక్ ఖాదర్బాషా దాడికి పాల్పడ్డారు. దీంతో మంగళవారం రాత్రి బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.