బేగంపేట్, జూన్ 18: చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న మహిళలను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఐడీ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, దివ్యదిశ ఫౌండేషన్ ప్రతినిధుల సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, సీటీవో జంక్షన్, రసూల్పుర జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి చిన్నారులను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించారు. సుమారు 20 మంది చిన్నారులను, వారితో పాటు మహిళలను అదుపులోకి తీసుకుని రాంగోపాల్పేట పోలీసులకు అప్పగించారు. అయితే మహిళలు వారి సొంత పిల్లలతో యాచక వృత్తి సాగిస్తున్నారా, అద్దెకు తీసుకున్నారా.. అనే విషయాలను నిర్ధారించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని స్టేట్ హోంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.