బంజారాహిల్స్,ఆగస్టు 18 : డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతూ పోలీస్ అధికారిని అంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రతో కలిసి వివరాలు వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ప్రాంతానికి చెందిన భర్తపురం మహేష్(31) బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నివాసం ఉండేవాడు. బంజారాహిల్స్ రోడ్ నెం 13కు చెందిన ఓ వైద్యుడివద్ద డ్రైవర్గా పనిచేసిన మహేష్ రెండేళ్ల క్రితం కొంత డబ్బును తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగం మానేశాడు. మాజీ యజమానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకున్న మహేష్ వాటి అధారంగా డబ్బులు లాగాలని ప్రణాళికలు వేశాడు.
దీనిలో భాగంగా సన్సిటీలో నివాసం ఉంటున్న విశాఖపట్నంలోని మరిపాలెం ప్రాంతానికి చెందిన రాజీవ్ గౌతమ్నాయర్ (31) అనే వ్యక్తితో కలిసి ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా గౌతమ్నాయర్ తాను ఖమ్మం సీఐని అని వైద్యుడికి ఫోన్ కాల్ చేశాడు. మీకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్లు ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని చెప్పడంతో పోలీసులు మంగళవారం నిందితుడు గౌతమ్నాయర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ కేసులో మరో నిందితుడు మహేష్ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. వారివద్దనుంచి మహేంద్ర కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.