మన్సూరాబాద్, జూలై 30: ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తూ విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో ఉగాండ దేశానికి చెందిన ఓ మహిళను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ) సహకారంతో మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ నుంచి రూ. 8,750 వేల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండకు చెందిన నముబీరు సయన (32) ప్రస్తుతం నగరంలోని టోలిచౌకీలో ఉంటుంది. వ్యాపారం పేరుతో 2017లో విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చింది. 2018లో ఉగండాకు వెళ్లాల్సి ఉండగా.. న్యూఢిల్లీలో ప్రమాదవశాత్తు బాత్రూమ్లో పడిన ఘటనలో దెబ్బలు తగిలాయి. చికిత్స అనంతరం మూడు నెలల కిందట తిరిగి నగరానికి వచ్చి టోలిచౌకీలో ఉంటుంది. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమెకు డబ్బులు అవసరమయ్యాయి. దీంతో ఆమె కొందరు ఆఫ్రికన్ యువతుల ఫొటోలను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మీర్పేట్ పోలీసుల సహకారంతో ఎస్ఓటీ డీసీపీ సురేందర్రెడ్డి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్, మీర్పేట్ సీఐ ఎం.మహేందర్రెడ్డి బృందం బాలాపూర్ క్రాస్ రోడ్డు మంత్రాల చెరువు వద్ద నుంచి ఓ ట్యాక్సీ కారులో వస్తున్న నముబీరు సయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.