మియాపూర్ , మే 11 :రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ముంపు సమస్య పునరావృతం కాకుండా వరద కాలువల నిర్మాణాన్ని అత్యంత పటిష్టంగా చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవసరమున్న అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలో వెంకటేశ్వరనగర్లో రూ. 16 లక్షలతో చేపట్టనున్న వరద నీటి కాలువ పనులకు కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాసరావు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించాలని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తూ సవాల్ విసురుతున్న ప్రస్తుత సమయంలోనూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీరాములు, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, సుధాకర్,నాగేశ్వర్నాయక్,మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి,హరినాథ్,శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్,కృష్ణమూర్తి, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన 137 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ. 1,37,15,892 విలువగల చెక్కులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ మంగళవారం మియాపూర్లోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. ఈ పథకాల ద్వారా పేదింట పెండ్లి కాంతులు నెలకొంటున్నాయని విప్ గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిని అందించినట్లు విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయబ్ తాసీల్దార్ శంకర్, పార్టీ నేత శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.