మియాపూర్ , మే 10 : విలువైన చెరువు స్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకుంటూనే వాకింగ్ ట్రాక్లు, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే స్పాట్లుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు చెరువులను దత్తత తీసుకుని సుందరీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పటేల్ చెరువు సుందరీకరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులోకి మురుగు నీరు కలువకుండా చెరువు చుట్టూ నిర్మిస్తున్న యూజీడీ పైపులైన్ల లెవెలింగ్ను తెలుసుకునేందుకు స్వయంగా ఆ పైపులోపలికి వెళ్లి ఆయన తనిఖీ చేశారు.