అమీర్పేట్, అక్టోబర్ 26: గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 2017 వరకు వేతనాలు అందని అర్చక ఉద్యోగుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు తెలిపారు. మంగళవారం సనత్నగర్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ఉమ్మడి 10 జిల్లాల అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29న జరిగే సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి దృష్టికి అర్చక ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కాండూరి కృష్ణమాచారి, జేఏసీ గౌరవాధ్యక్షురాలు ఎస్.అన్నపూర్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, చింతబట్ట భద్రీనాథాచార్యులు, మాచారం యాదగిరి, అనిల్, పారునంది నాగరాజు శర్మ, నల్లాన చక్రవర్తుల వేణుగోపాలాచారి, దిలీప్ జోషి, రాయప్రోలు మల్లికార్జున శర్మ, బండారి జగపతి, బి.సురేశ్, ఆర్.రిపుంజయ్ శర్మ పాల్గొన్నారు.