సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : గుండె జబ్బుతో బాధపడుతూ….ఊపిరితిత్తులూ దెబ్బతిన్న ఓ యువతికి వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. నగరానికి చెందిన 25 ఏండ్ల లబ్దాని జైన్కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది. వయస్సుతో పాటు సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. రెండున్నర సంవత్సరాలుగా ఆక్సిజన్ సాయంతోనే జీవించిన ఆమె ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతిన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు అపోలో దవాఖానలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు ఆమె గుండె వైఫల్యం చెందినట్లు నిర్ధారించారు. రెండు అవయవాల మార్పిడే మార్గమని వైద్యులు తేల్చిచెప్పారు. అప్పటికే ప్రభుత్వ జీవన్దాన్లో దరఖాస్తు చేసుకోగా, ఇటీవల బ్రెయిన్డెడ్కు గురైన 18 సంవత్సరాల యువతి నుంచి గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ఈ నెల 20న ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ నేతృత్వంలో అపోలో వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించి ఒకేసారి గుండె, ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. సోమవారం ఆమె పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. కొత్త జీవితాన్ని ప్రసాదించిన అపోలో వైద్యులను లబ్దాని జైన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.