న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసులు మూడు కోట్ల మార్క్ను దాటాయి. తాజాగా.. 68,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో వైపు యాక్టివ్ కేసుల సంఖ్య దిగి వస్తున్నది. 82 రోజుల కనిష్ఠానికి చేరాయని, ప్రస్తుతం 6.43లక్షలకు చేరాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో వైపు కొత్తగా 1,358 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది. ఇప్పటి వరకు 2,89,94,855 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. జాతీయ రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.67శాతానికి పడిపోయిందని తెలిపింది.