కొవిడ్ మహమ్మారి ఎందరినో దూరం చేసింది. అదే సమయంలో బంధాలను బలోపేతం చేయడంలోనూ ముఖ్యపాత్ర పోషించిందని అంటున్నారు నిపుణులు. లాక్డౌన్వల్ల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో జీవిత భాగస్వాముల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే, ఈ రకమైన ఒత్తిడి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడిందని విశ్లేషిస్తున్నారు. భాగస్వామితో అన్యోన్యంగా ఉన్నవాళ్లు ఒత్తిడిని సులభంగా జయించారట. తమను తాము నిందించే వారికంటే, సమస్యను తప్పుబట్టిన వాళ్లే చాలా సంతోషంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకుల ప్రకారం, లాక్డౌన్వల్ల రకరకాల ఒత్తిళ్లకు గురైనవారిలో తమను తాము కాకుండా పరిస్థితులను నిందించిన వాళ్లు సత్ఫలితాలను పొందారు. సమస్యను పక్కన పెట్టి ఒకరి నొకరు నిందించుకున్న వాళ్లు సుఖంగా లేరని తెలిసింది. ఇందుకోసం 191 మంది జీవిత భాగస్వాములపై అధ్యయనం చేశారు. ప్రముఖ జర్నల్ ‘సోషల్ సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్’లో ఇది ప్రచురితమైంది.