కరోనా మహమ్మారి కల్లోలంతో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రాణావాయువు అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. మధ్యప్రదేశ్లోని ఓ దవాఖానకు ఆక్సిజన్ సిలిండర్ల లారీ వచ్చీరాగానే దాంట్లోని సిలిండర్లను జనం ఎత్తుకెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ర్టాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనా రెండో దశ ఉద్ధృతితో ఉత్తర భారతదేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం కరోనా రోగులు అల్లాడుతున్నారు. సిలిండర్లు పట్టుకుని ప్లాంట్ల ముందు వందల మంది బారులు తీరుతున్నారు. పలుచోట్ల సిలిండర్లను ఎత్తుకెళ్లే ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్టాలు మొరపెట్టుకుంటున్నాయి. మరోవైపు ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ర్టాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా మధ్య వివాదం ముదిరింది. తమకు ఆక్సిజన్ సరఫరా చేయకుండా విక్రేతలను హర్యానా, యూపీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. దీంతో ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని దవాఖానలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని గంటలకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి అనేకమంది రోగులు చికిత్స కోసం నగరానికి వస్తున్నారని, ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన ఆక్సిజన్ కోటాను 378 మెట్రిక్ టన్నుల నుంచి 700 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ర్టాలు తమకు కేటాయించిన ఆక్సిజన్నే వాడుకోవాలని, ఇతరుల వాటాకు అడ్డంకులు కల్పించొద్దని విజ్ఞప్తిచేశారు. హర్యానాలాగే యూపీ ప్రభుత్వం తమకు ఆక్సిజన్ చేరకుండా ప్లాంట్లను అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
ఆరోపణలు అవాస్తవం: హర్యానా
ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలను హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్ధన్ ఖండించారు. తాము ఆక్సిజన్ను అడ్డుకోలేదన్నారు. అంతకుముందు హర్యానా మంత్రి అనిల్ విజ్ ఢిల్లీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పానిపట్ నుంచి ఫరీదాబాద్ వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ను ఢిల్లీ ప్రభుత్వం దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. ఆక్సిజన్ ట్యాంకర్లకు పోలీస్ భద్రత కల్పించనున్నట్టు చెప్పారు. మరోవైపు, తమకు ఆక్సిజన్ కోటాను 120 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రానికి సీఎం మనోహర్లాల్ ఖట్టర్ లేఖ రాశారు.
లారీ వచ్చీ రాగానే సిలిండర్లను దోచేశారు
మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో ఓ దవాఖానకు లారీలో ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తుండగా కొందరు వ్యక్తులు వాటిని ఎత్తుకున్నారు. దవాఖాన వద్దకు లారీ చేరుకోగానే దుండగులు చోరీకి పాల్పడ్డారు. వారిని ఇంకా గుర్తించాల్సి ఉన్నది. నిందితులు ఆ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల బంధువులుగా భావిస్తున్నారు. ఇదే జిల్లాలోని మరో దవాఖానలో గత సోమవారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
ఆక్సిజన్తో ప్రయోగాలొద్దు: గులేరియా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఆక్సిజన్ను జాగరూకతతో వాడుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. ఆక్సిజన్ స్థాయిలు 93-99 శాతం మధ్య ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం లేదని తెలిపారు. ఆక్సిజన్ కూడా ఒక ఔషధం లాంటిదని పేర్కొన్న ఆయన.. ప్రాణవాయువును అనవసరంగా వాడడం వల్ల ఆక్సిజన్ వృథా తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టంచేశారు. చాలా మంది రోగులు ఆక్సిజన్ సిలిండర్లు ఇంటికి తీసుకెళ్లి రెండు గంటలు లేదా మూడు గంటలు పెట్టుకుంటున్నారని, దాని వల్ల ప్రయోజనం కంటే హానే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. అవసరంలో ఉన్నవారికి ఆక్సిజన్ అందకుండా పోతుందని పేర్కొన్నారు.
ఆక్సిజన్ లేదంటూ దవాఖాన ముందు నోటీసు
యూపీలోనూ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. తమ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయని, ప్రాణవాయువు అవసరమైన కరోనా రోగులను వారి కుటుంబ సభ్యులు ఇతర దవాఖానలకు తరలించాలని లక్నోలోని ఓ దవాఖాన బహిరంగ నోటీసును అంటించింది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు, రాష్ట్రంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత నెలకొందని, కనీసం రోజుకు 120 మెట్రిక్ టన్నులను సరఫరా చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు నెలల కిందట ఆమోదం లభించిన రెండు పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.
రోజుకి 7,500 ఎంటీల ఆక్సిజన్ ఉత్పత్తి
ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత్లో రోజుకి 7,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతున్నదని, అందులో 6,600 మెట్రిక్ టన్నులను వైద్యావసరాల కోసం రాష్ర్టాలకు కేటాయిస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం బుధవారం ఈ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, రాష్ర్టాలు తమకు ఎదురయ్యే సమస్యలను కంట్రోల్ రూమ్కు తెలియజేయవచ్చని రాజేశ్ భూషణ్ తెలిపారు. విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకోనున్నామని, దాని కోసం సరఫరాదారుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను దిగుమతికి కేంద్రం టెండర్ పిలిచినట్టు మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి.