ధైర్యం కోల్పోకుండా చికిత్స తీసుకున్న వికాస్నగర్కు చెందిన ఆండాళమ్మ
తాను కోలుకొని కుటుంబ సభ్యులకు సూచనలు, సలహాలు
ఎల్బీనగర్, మే 10: కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది మృత్యువు ఒడిలోకి చేరుతున్నా వంద ఏండ్ల బామ్మ మాత్రం దిగ్విజయంగా జయించింది. అంతేకాక ఓ వైపు తన పనులు తానే చేసుకుంటూ మరోవైపు తన మనవండ్లు, మనవరాండ్లకు కరోనాపై జాగ్రత్తలు వివరిస్తున్నది. ఆయుర్వేద డాక్టరైన ఈ బామ్మ కరోనా వచ్చిందని తెలిసినా ఎలాంటి ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొని కరోనాపై గెలిచింది.
నిజామాబాద్ జిల్లా దివిపేటకు చెందిన ఆండాళమ్మకు ఏలూరుకు చెందిన నర్సింహాచార్యులతో(దివంగత) వివాహం జరగగా.. 120 ఏండ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆండాళమ్మ(100) కు ఏడుగురు సంతానం. ఇందులో ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆమె సరూర్నగర్లోని వికాస్ నగర్లో నివసిస్తున్న మూడో కుమారుడు వెంకటాచారి వద్ద ఉంటున్నారు. నలుగురు కుమారులు పౌరోహిత్యం చేస్తుండగా.. మూడో కుమారుడు వెంకటాచారి మాత్రం హైదరాబాద్లోని డాక్టర్స్ అసోసియేషన్లో స్టాటిస్టికల్ అధికారిగా పని చేసి ఇటీవలే రిటైర్డ్ అయ్యారు. ఇక ఇద్దరు కూతుళ్లు సీతాదేవి, భాగ్యలక్ష్మి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆండాళ్లమ్మకు మనుమలు, మునిమనుమలు కూడా ఉన్నారు.
వెంకటాచారి కుమార్తె స్వాతి, ఆమె భర్త రఘు మహారాష్ట్రలో ఉంటుండగా కరోనా సోకింది. దీంతో వారిని హైదరాబాద్కు తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఈ క్రమంలో వారి నుంచి ఆండాళమ్మతో పాటు వెంకటాచారి కోడలు సౌమ్యకు కూడా వైరస్ అంటింది. అయితే ఆయుర్వేద వైద్యురాలైన ఆండాళ్లమ్మ వైరస్ సోకిందని తెలిసినా అధైర్యపడలేదు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు సిద్ధమైంది. డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకుంటూ.. వారిచ్చిన మందులు వాడుతూ కరోనాను జయించింది. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులకు కరోనాపై జాగ్రత్తలు వివరిస్తున్నది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా నెగిటివ్ వచ్చింది.
100 ఏండ్ల వయసులోనూ కరోనాను జయించిన బామ్మను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ బామ్మను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. ఆండాలమ్మ స్వతహాగా ఆయుర్వేద వైద్యం చేస్తారు. ఆమె తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంది. పాటలు రాయడంతో పాటుగా రాగయక్తంగా పాడుతుంది. కరోనా వచ్చినప్పుడు ధైర్యం వీడకుండా ఉండి వైద్యం తీసుకుంటూ కోలుకుంది. పలువురికి ఆదర్శంగా నిలిచింది.
కరోనా వచ్చిందని భయపడొద్దు. ధైర్యంగా మహమ్మారిని ఎదుర్కోవాలి. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటించా. మందులు వేసుకున్నా. మానసిక ధైర్యాన్ని పెంచుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. – ఆండాళమ్మ
మా అమ్మమ్మే మాకు స్ఫూర్తి.. ఆమె ఆయుర్వేద డాక్టర్ అయినందునే కరోనాను జయించింది. వైరస్ సోకిందని తెలిసి కూడా ధైర్యం కోల్పోలేదు. మేమందరం భయపడుతుంటే ఆమె మాత్రం మాకే ధైర్యం చెప్పేది. ఐదు తరాలు చూసిన ఆమె కరోనాను జయించడం ఆనందంగా ఉంది. – ప్రణవి, మనవరాలు