హిమాయత్నగర్, నవంబర్ 24 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి సభను డిసెంబర్1న గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో జరుపుతున్నట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ముదిరాజ్ తెలిపారు. గురువారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అతడి భార్య, కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి చేయూతనందించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ శాఖలో కిష్టయ్య పేరిట అవార్డును ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర హోంమత్రి, డీజీపీకి వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ సలహాదారుడు పిట్టల రవీందర్, ముదిరాజ్ అధ్యాయన వేదిక చైర్మన్ ప్రొఫెసర్ నీల రాములు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ బొక్కా శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు కొడిమెల హన్మంతరావు, రవికాంత్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.