కంటోన్మెంట్ : త్వరలోనే కార్ఖానాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు బుధవారం మూడో వార్డులోని కార్ఖానా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న సందర్శించారు. ఈ సందర్భంగా టీకాలకు సంబంధించిన విషయాలతో పాటు పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. పాఠశాలను సుందీకరణ చేసేందుకు కావాల్సిన నిధులను తన కోటా ద్వారా త్వరలోనే మంజూరు చేయిస్తానని చెప్పారు. కరోనా కారణంగా పాఠశాలలు ఇన్నాళ్లు తెరుచుకోకపోవడంతో పాఠశాలల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, రెండు రోజుల్లో పాఠశాల మెరుగు కోసం పనులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు సాయికిరణ్, నివేదిత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.