ఖైరతాబాద్, ఆగస్టు 17 : తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు పీవీ నరసింహారావు మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా 10వ గ్రాండ్ నర్సరీ మేళా (ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో)ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఖలీద్ అహ్మద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పీపుల్స్ప్లాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అన్ని రాష్ర్టాల నుంచి వివిధ రకాల పుష్ప జాతులు, మొక్కలు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రధానంగా కాక్టస్, సక్యూలెంట్స్, బోన్సాయ్, అడేనియం, ఇండోర్, ఔట్డోర్, ఆక్సిజన్ మొక్కలు, కరోనా నేపథ్యంలో ఔషధ మొక్కలు సైతం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. టెర్రస్ గార్డెన్, వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సిరమిక్, మట్టి పాత్రలు తదితర 140 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఇక్కడికి వచ్చే వారు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సందర్శకుల కోసం శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్ధేశించిన స్థలాల్లో పార్కింగ్ చేయాలన్నారు. 19న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను సైతం ఆహ్వానించామని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహకులు నరహరి, తదితరులు పాల్గొన్నారు.