జైపూర్ : రాజస్థాన్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయింది. పెట్రోలింగ్ బృందంపై కాల్పులు జరుపడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన భిల్వారా జిల్లాలో శనివారం రాత్రి కోట్డి, రాయ్కా పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న సాయుధ స్మగ్లర్లు పోలీసు బృందాలపై కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేసినట్లు భిల్వారా ఎస్పీ వికాస్ శర్మ తెలిపారు. కాల్పుల్లో ఓంకార్ రాయ్కా, పవన్ చౌదరి మృతి చెందినట్లు పేర్కొన్నారు.