వారంతా కరోనా రోగుల సహాయకులు. వివిధ ప్రాంతాల నుంచి గాంధీకి వచ్చిన వారే. రోగులతో పాటు ఉంటూ వార్డులన్నీ కలియదిరుగుతుండటంతో అక్కడి వైద్యులు వైద్యశాలలో ఉండడానికి అనుమతి నిరాకరించారు. దీంతో వారంతా దవాఖాన పరిసరాలు, రోడ్ల పక్కన ఉంటూ అష్టకష్టాలు పడుతున్నారు. వీరి బాధలు గుర్తించిన ప్రభుత్వం గాంధీ ఎదురుగా ఉన్న కచ్ కడవ గుజరాతీ పాటిదార్ సమాజ్ భవన్లో ఆశ్రయం కల్పించారు. కావాల్సిన వసతులు సమకూర్చారు.
బన్సీలాల్పేట్, మే 22 : కరోనా నియంత్రణ చర్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమన్వయంతో పని చేస్తున్న జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు రోగి సహాయకుల కోసం గాంధీ దవాఖాన ఎదురుగా ఉన్న కచ్ కడవ గుజరాతీ పాటిదార్ సమాజ్ భవన్లో ఆశ్రయం కల్పించారు.
తెలంగాణ, ఏపీకి చెందిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి అక్కడ ఉచితంగా వసతి, భోజనం సమకూరుస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్లు పాటిదార్ సమాజ్ అధ్యక్షుడు కాంతీలాల్ ప్రేమ్జీ గోరాని, కార్యదర్శి పురుషోత్తం పటేల్, సభ్యుడు మణిలాల్ పటేల్తో సమావేశం నిర్వహించారు. రెండు నెలల పాటు రోగి సహాయకుల కోసం వసతి కేటాయించాలని కోరడంతో వారు తమ మూడు అంతస్తుల భవనాన్ని ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారు. వందమంది ఉండేందుకు వసతి, సదుపాయాలు కల్పించి, అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా వారికి రోజూ రెండు పూటలా భోజనం సమకూర్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు. గాంధీ నగర్, చిలకలగూడ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ డిసీ, సికింద్రాబాద్ మండల తహసీల్దార్లు ఈ శిబిరంలోని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మా నాన్న నర్సింహకు కరోనా రావడంతో గాంధీలో చేర్పించాం. నేను రోజుకి మూడు సార్లు లోపలికి పోయి మందులు వేసి, ఏదైనా తినిపించి వస్తున్నాను. మెట్రో స్టేషన్ కింద తలదాచుకుంటున్న మాలాంటి వారికి ఇక్కడ బాత్రూమ్లు, ఫ్యాన్లు, పరిశుభ్రమైన ప్రదేశంలో ఉచిత వసతి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. – మల్లయ్య (కందుకూరు, రంగారెడ్డి)
శ్రీ కచ్ కడవ పాటిదార్ సమాజ్ వారు గతేడాది కూడా లాక్డౌన్ సమయంలో పేదలకు అన్నదానాలు చేశారు. ఈ సారి కలెక్టర్, పోలీసు, బల్దియా అధికారులు అడగడంతో మా సమాజ్ అధ్యక్షుడు కాంతిలాల్ గోరాని రెండు నెలల పాటు ఉచితంగా వసతి సదుపాయం కల్పించారు. ఇక్కడ ఉండే వారికి అవసరమైన విద్యుత్, నీరు, భోజనం లాంటి ఏర్పాట్లను వారు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి పేదలకు అండగా నిలవడం అభినందనీయం. – కిష్టప్ప (మేనేజర్, పాటిదార్ భవన్)
జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ అధికారులు గాంధీ దవాఖానలోని పారిశుధ్యంపై నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. శానిటరీ సిబ్బంది రోడ్లు, అంతర్గత వీధులన్నీ ప్రతిరోజు శభ్రం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పాటిదార్ భవన్లో కరోనా రోగుల సహాయకులకు వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 25 మంది ఇక్కడ ఉన్నారు. – నర్సింగ్రావు (సూపర్వైజర్, జీహెచ్ఎంసీ)
మా అక్క బాలమ్మకు కరోనా సోకడంతో రెండు రోజుల క్రితం గాంధీ దవాఖానలో చేర్పించాం. లోపల ఉండనిస్తలేరు. గేటు బయట ఉండగా పోలీసులు ఇక్కడ ఉచిత వసతి ఉన్నదని చెప్పడంతో నేను, మా అక్క కొడుకు శంకర్ ఇక్కడకు వచ్చాం. ఇంత పెద్ద సిటీలో మాకెవరూ లేరు. దిక్కులేనోల్లకు సర్కారే దిక్కైంది. సీఎం కేసీఆర్ సార్కు మా థ్యాంక్స్. – లక్ష్మి (నారాయణ్ఖేడ్, సంగారెడ్డి)
మా నాన్నగారు అబూబాకర్కు కరోనా సోకింది. ఈ నెల 5న తీవ్రమైన ఆయాసం రావడంతో విజయవాడలో ఉన్న అన్ని ఆస్పత్రులు తిరిగినా బెడ్లు ఖాళీ లేవంటూ నిరాకరించారు. పరిస్థితి విషమించడంతో ఆందోళనకు గురై నేరుగా అంబులెన్స్లో గాంధీకి తీసుకురావడంతో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. మాకు ఇక్కడ ఉచితంగా వసతి, భోజన సదుపాయాలను కల్పించిన ప్రభుత్వానికి మా ధన్యవాదములు తెలుపుతున్నాము. – షోయబ్ (విజయవాడ)