వ్యవసాయ యూనివర్సిటీ మే 21 : ప్రస్తుత కరోనా కష్టకాలంలో దేశ రైతులకు సరైన ఆరోగ్య సలహాలను అందించడమే తమ లక్ష్యమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర తెలిపారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పరిధిలోని మేనేజ్ కార్యాలయం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కరోనా బారిన పడకుండా చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. మేనేజ్తో పాటు కేర్ దవాఖాన సహకారంతో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల రైతులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ సూచనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఐసీఎంఆర్ – ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ సంస్థ మార్గదర్శకాలను విస్తృత నెట్వర్క్తో ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. ఆన్లైన్ సదుపాయాలతో వివిధ ఈఈఐ సమితి, ఈఈఐఎస్, ఎఫ్ఫీఓఎస్, తమ వద్ద శిక్షణ పొందిన అగ్రి డీలర్స్, పీజీ విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. రైతుల పొలాల వద్దకే నేరుగా వెళ్లి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరపత్రాలు, తదితర సాధనాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణతో పాటు 15 రాష్ర్టాలలో 255 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామన్నారు. 42వేల 300మంది అవగాహన కల్పించామని తెలిపారు.