వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 30 : పరిశోధన, సాంకేతికత తోడైనప్పుడే రైతాంగానికి మేలు జరుగుతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమకూరుతున్న వనరులతో విద్యా ప్రమాణాలు పెరిగాయని, పరిశోధన, సాంకేతికతపై యువతరంలో పెనుమార్పులు వస్తున్నాయని, అందువల్లే మారుమూల గ్రామాల నుంచి వచ్చిన రైతు బిడ్డలతో రైతుకు మంచి సమాచారం, టెక్నాలజీ అందుతుందని పేర్కొన్నారు. దేశ రైతాంగమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని తెలిపారు.
సోమవారం ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అగ్రి ఇన్నోవేషన్ హబ్ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉపకులపతి ప్రవీణ్రావు నేతృత్వంలో వర్సిటీ అద్భుతంగా పనిచేస్తున్నదని అభినందించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా వేరు శనగ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశోధనల కోసమే వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగును పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయ పడ్డారు.
అగ్రిహబ్ ఎండీ డా.కల్పనాశాస్త్రి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. నూతన టెక్నాలజీతో నాణ్యత గల విత్తనాలు, మొక్కలకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ హబ్ ద్వారా రైతుకు పెట్టుబడులు తగ్గి, పంటలో నాణ్యత పెరుగుతుందన్నారు. దీంతో అధిక దిగుబడులు పెరిగి దేశ రైతాంగం తెలంగాణ వైపు చూసే అవకాశాలున్నాయని అన్నారు. పరిశ్రమ ప్రతినిధులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
స్టాల్స్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరగానే నేతలు, అధికారులు, స్టాల్స్, వివిధ సంస్థల యజమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. అప్పటికే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు కూడా అక్కడ నిలబడ్డారు. విద్యార్థులను గమనించిన మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మాత్రమే ముందుకు రావాలని సూచించారు. హబ్ ఉపయోగంపై విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి సాగు బడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రణాళిక అందరికీ చేరాలన్నారు. ప్రతి స్టాల్కు వెళ్లిన మంత్రికి వాటి ఉపయోగాలు, పనితీరును వివరించారు. హబ్ పనితీరుపై శాస్త్రవేత్తలు, విద్యార్థులతో మంత్రి కేటీఆర్ జరిపిన సుదీర్ఘ చర్చ అక్కడ సంతోష వాతావరణాన్ని ఏర్పరిచింది. ఇది స్వరాష్ట్రంలో కొత్త శఖానికి నాందిగా విద్యార్థులు అభివర్ణించారు.
అగ్రిహబ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడే ఉన్న నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనిక, తల్లిదండ్రులను పలుకరించారు. మీ ప్రాంతంలో సాగు ఎలా ఉందని అడిగారు. సీఎం కేసీఆర్ తీసుకున్న శాశ్వత నిర్ణయం వల్ల మా ప్రాంతమంతా సాగు నీరు వస్తుంది. నాడు వర్షాదార పంటలపై అధారపడేది. ఒక్క పంటకు కూడా భరోసా లేని కాలం. కృష్ణానది నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నేడు మూడు పంటలు సాగు చేస్తున్నామంటూ మంత్రికి తెలిపారు.
కరోనా కారణంగా కళాశాల బంద్ కావడంతో మాకు మా పిల్లలు సాగు పనుల్లో అండగా నిలిచారన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ సారి తెలంగాణ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాధించింది. రాష్ట్రంలో సెంటు భూమి ఖాళీ లేకుండా సాగు కావాలే. అదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి అధునాతన టెక్నాలజీ లేదు. సమయం వృథా చేయకుండా చదివి మంచి ఫలితాలు పొందాలని విద్యార్థులకు సూచించారు.
కేటీఆర్ సర్, ఈ యూనివర్సిటీలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా ప్రాంతంలో కూడా అందరూ నన్ను గౌరవంగా చూస్తున్నారు. నాన్నకు సాగులోని మెళకువలు చెబుతుంటే లోలోన ముసిరిపోతున్నారు. మా పంటలు చాలా బాగున్నాయి. కొవిడ్ నగర వాసులకు మాత్రమే. మా పల్లెలో నాన్నతో పాటు సమీప రైతులంతా సాగు ముచ్చట్లు విన్నారు. – హిమబిందు, అగ్రి బీఎస్సీ ఫైనల్ ఇయర్
వీసీ కార్యాలయం సమీపంలోని 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్రిహబ్ నిర్మించారు. సాంకేతిక, 21 స్టార్టప్లను గుర్తించిన ఐటీ శాఖ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం, తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. గ్రామీణ యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు అగ్రి బిజినెస్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ హబ్ ఓ గ్రంథాలయంగా ఉపయోగ పడుతుంది.