అభివృద్ధే కేంద్రంగా భాసిల్లుతున్న గ్రేటర్ హైదరాబాద్.. వాహనాల సంఖ్యలోనూ దూసుకుపోతున్నది. ఒక్కో ఇంట్లో రెండుకు మించి వాహనాలు ఉండడంతో గ్రేటర్ జనాభాలో మూడు వంతులు వాహనాల సంఖ్య ఉండడం విశేషం. ఇందులో ద్విచక్ర వాహనాలే 70 శాతం ఉండగా, 20% కార్లు ఉన్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తగినట్లు జీహెచ్ఎంసీ ప్రతియేటా రోడ్ల విస్తరణ చేపడుతోంది. గ్రేటర్ వైశాల్యం 650 చదరపు కిలోమీటర్లు కాగా, ఇందులో రహదారుల విస్తీర్ణం 11.5 శాతం. ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు, మెట్రో రైళ్లు కిటకిటలాడి ప్రయాణిస్తున్నప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా తర్వాత వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లకు నగరవాసులు మొగ్గుచూపుతున్నారు.
వాహనాల సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోతున్నది. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు సంబంధించి విస్తృతమైన అవకాశాలున్న నగరంలో గడప దాటితే వాహనం కావాల్సిందే. అందుకే ఒక్కో ఇంట్లో రెండు, మూడు వాహనాలు కొనాల్సిన పరిస్థితి. రవాణా శాఖ రికార్డుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్యను పరిశీలిస్తే భారీగా ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది. ప్రధానంగా ఇందులో 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలు ఉండగా 18 నుంచి 19 శాతం కార్లు ఉండటం విశేషం. ఈ స్థాయిలో వాహనాలు తిరిగేందుకు ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ రహదారుల విస్తీర్ణాన్ని కూడా పెంచుతున్నది. దీంతో నగర వైశాల్యంలో ప్రస్తుతం రహదారుల విస్తీర్ణం పదకొండున్నర శాతంతో దేశంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్.. గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో రైలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహనాలకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తుండగా, 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్లో తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో రైలులో రోజుకు 1.20 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. కరోనా సమయంలో ఈ మూడు మార్గాల్లో ఆక్యుపెన్సీ తగ్గింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అప్పుడు ఇప్పుడు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉండటం విశేషం.
వాహనాల రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తున్నది. హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మూసారాంబాగ్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డిలో కొండాపూర్, అత్తాపూర్ కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉప్పల్, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు అన్ని రకాల వాహనాలు 40 లక్షల వరకు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 16.79 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో సుమారు 15 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి.
దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 72.03 లక్షల వాహనాలు ఉండగా ఇందులో 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయ రికార్డులను పరిశీలిస్తే గత మూడు సంవత్సరాల్లోనే దాదాపు పదిన్నర శాతం వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులోనూ అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే 50 శాతం కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. కరోనా తీవ్ర ప్రభావం చూపిన 2020లో కొంతమేర కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గినా 2021లో మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. కాగా కరోనా తర్వాత నగరవాసులు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు.
నానాటికీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలు పెరుగుతుండగా అందుకనుగుణంగా రహదారులను పెంచడం ప్రభుత్వాలకు సవాల్. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిరావడం అనివార్యం. ఈ క్రమంలో నగరం విస్తరిస్తున్నప్పటికీ జీవన వ్యయాన్ని తగ్గించుకునేందుకు లక్షలాది కుటుంబాలు శివారు ప్రాంతాల్లోనే నివాసమంటున్నాయి.
అయినా ఉదయం కాగానే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు ప్రధాన ప్రాంతాలకు వచ్చేందుకు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నగరంలోని వేలాది అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసింది. దీనికి తోడు అవుటర్-ఇన్నర్ రింగు రోడ్డులను అనుసంధానించేందుకు కొత్త మార్గాలను అభివృద్ధి చేసింది. వీటికి తోడు ఉన్న రోడ్ల విస్తరణ పనుల్ని కూడా భారీఎత్తున చేపట్టింది.
అందుకే జీహెచ్ఎంసీ ఏటా తన బడ్జెట్లో 16.15 శాతం నిధుల్ని రహదారుల వ్యవస్థ అభివృద్ధికే వెచ్చిస్తున్నది. 2014 నుంచి ఏటేటా బడ్జెట్లో రహదారుల అభివృద్ధికి నిధుల మొత్తాన్ని పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వం 2019-20లో రూ.549.44 కోట్లు.. 2020-21 సంవత్సరంలో ఏకంగా రూ.1126.38 కోట్లు ఖర్చు చేసిందంటే రహదారుల అభివృద్ధి ఏమేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ మహా నగర విస్తీర్ణంలో రహదారుల విస్తీర్ణం 11.5 శాతానికి చేరుకుంది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే మొదటి స్థానంలో ఢిల్లీ, ఆపై బెంగళూరు ఉండగా మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి