సిటీ క్రిమినల్ కోర్ట్స్, నాంపల్లి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): న్యాయవాదులకు కేసీఆర్ ప్రభుత్వ అమలు చేస్తున్న అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ హెల్త్ కార్డులను రెన్యువల్ చేసిన యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ మంగళవారం సభ్యులకు అందజేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి వెంకట్ నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులకు సంబంధించి మొత్తం 1547 మంది ఉండగా, వారి కుటుంబ సభ్యులతో కలిపి 4383 హెల్త్ కార్డులను సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్కు అందజేశారు. ఈ కార్డులను రేపటి నుంచి బార్ అసోసియేషన్లో తీసుకోవాలని అధ్యక్షుడు మధుశేఖర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు.
సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా సోకి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు ముందుకు వచ్చింది. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి మేరకు పేద, మధ్య తరగతి న్యాయవాదులకు, కరోనా వచ్చిన వాళ్లకి వారి సేవింగ్ అకౌంట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.3లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని ఎస్బీఐ హైదరాబాద్ శాఖ అధికారులు, బార్ కౌన్సిల్ కార్యదర్శి రేణుక తెలిపారు.
సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వృద్ధురాలు సుశీలమ్మ పరిస్థితి గురించి తెలుసుకున్న మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆమెకు ఆపన్న హస్తం అందించింది. అథారిటీ కార్యదర్శి రాధాకృష్ణ చౌహాన్ ఆదేశాల మేరకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది వృద్ధ్దురాలు ఉన్న ప్రదేశానికి చేరుకొన్నారు. ఆమెను గాంధీ దవాఖానకు తరలించి కొవిడ్ పరీక్ష చేయించి అక్కడి నుంచి సికింద్రాబాద్లోని మదర్ థెరిస్సా హోమ్కు తరలించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు ఆంజనేయులు, అనిల్కుమార్, పారా లీగల్ వలంటీర్లు రమేశ్బాబు, శ్రీనివాస్, జీహెచ్ఎంసీ సిబ్బంది సయ్యద్ పాల్గొన్నారు.