ఫైజర్ ఒక్క డోసుతో కూడా ఇదే స్థాయిలో రక్షణ
రెండు డోసులు వేసుకుంటే 97 శాతం ముప్పు లేనట్టే
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అధ్యయనంలో వెల్లడి
లండన్: కరోనా నియంత్రణలో దివ్యౌషధాలుగా పరిగణిస్తున్న వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలు ఇస్తున్నట్టు వాస్తవ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పును తగ్గించడంలో ఈ టీకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తేలడం ఊరటను కలిగిస్తున్నది. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వారిలో ప్రాణాలు కోల్పోయే ముప్పు 80 శాతం తగ్గుతున్నదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) సోమవారం వెల్లడించింది. అలాగే అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ను ఒక్క డోసు తీసుకుంటే ప్రాణ ముప్పు 80 శాతం తగ్గించవచ్చని, రెండు డోసులు తీసుకుంటే 97 శాతం వరకు తగ్గించవచ్చని వివరించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని విశ్లేషించి ఈ అధ్యయనం చేశామని పీహెచ్ఈ తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకా.. మరణాల రేటును ఎలా తగ్గిస్తుందో విశ్లేషించే మొదటి అధ్యయనం కూడా ఇదేనని వెల్లడించింది. గతేడాది డిసెంబర్-ఏప్రిల్ మధ్య వ్యాక్సిన్లు తీసుకున్న వారి వివరాలను సేకరించిన పీహెచ్ఈ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.