ఒక వైపు పోలీస్ ఉద్యోగంలో తీరిక లేక బిజీ బిజీగా ఉంటూనే.. తన మనసుకు ఆనందాన్ని ఇచ్చే హాబీని మాత్రం మర్చిపోలేదు. డ్యూటీలో నిబద్ధతతో పని చేస్తూనే.. 20 ఏండ్లగా పురాతన వస్తువులను సేకరిస్తున్నారు. ఈ తరం చూడని సుమారు అర్ధ శతాబ్దం నాటి వస్తువులు ఆయన ఇంట్లో దర్శనమిస్తాయి. అందులో ఒయారో 20 సీసీ మోటర్ సైకిల్…లాంబ్రేటా స్కూటర్ విత్ సైడ్ కారు, మోరిస్ మైనర్, పాత కాలంలో రైలును ఆపేందుకు ఉపయోగించే సిగ్నల్ లాంతర్, వాచీలు ఇలా… ఎన్నో అరుదైన వస్తువులను సేకరించారు..అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరినాథ్. కాలం మారినా.. చరిత్రనుకండ్ల ముందు ఉంచుతున్నారు.
నగరంలోని సుల్తాన్ బజార్లో జన్మించిన హరినాథ్ 1991లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. 1992లో మొగల్పురా ఎస్ఐగా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైం పీఎస్లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. హరినాథ్ తండ్రి ఎస్.సుబ్బారావు డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆంగ్ల బోధకుడిగా, తల్లి ఎస్. మహాలక్ష్మీ మహిళా, శిశు సంక్షేమ శాఖలో తెలుగు పండిట్గా పని చేశారు.
హరినాథ్ ఎంఏ జర్నలిజం, ఎంబీఏ ఫైనాన్స్ విద్యాభ్యాసం చేశారు. ప్రజా సేవ కోసం పోలీస్ అధికారి కావాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. అయితే పురాతన వస్తువులను సేకరించే హాబీని మాత్రం మరిచిపోలేదు. ఒక వైపు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే….సమయం దొరికినప్పుడల్లా ఎంతో ఓపికతో ఒక్కో వస్తువును సేకరిస్తూ వస్తున్నారు. అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తూ వాటిని పరిరక్షిస్తున్నారు.
ఈ వింటేజ్ వస్తువుల గురించి ఈ తరం పిల్లలకు వివరిస్తున్నప్పుడు మనస్సుకు ఆనందం కలుగుతుంది. అప్పటి రూపకర్తల మేధస్సు ఇప్పటి తరం ఆలోచన విధానంపై వారికి ఓ సబ్జెక్టులా పని చేస్తుంది. నేటికీ మా ఇంట్లో చెక్కతో చేసిన వస్తువులను గృహాలంకరణకు ఉపయోగిస్తాను. వీటితో పాటు ఆ తరంలోని పౌరులు పాటించిన క్రమశిక్షణ, ఆరోగ్య సూత్రాలను మా పిల్లలకు వివరిస్తా. పురాతన వస్తువులను అపురూపంగా చూసుకుంటాను. ఉద్యోగంలో కలిగే అలసటను మరిచిపోతాను. వింటేజ్ వాహనాల్లో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేనిది. -హరినాథ్, ఏసీపీ రాచకొండ సైబర్ క్రైం పీఎస్